Saturday, February 18, 2012

గజేంద్ర మోక్షము !

పూర్వము త్రికూటమనే కొండ ఒకటి ఉండేది ! త్రికూటంపైన వివిధ రకాలైన చెట్లు, పూతీవేలు వెండిబంగారములవలె తళతళా మెరిసేవి. ఈ కొండ నూరు యోజనముల విస్తీర్ణంలో వ్యాపించి ఉండేది. ఈ కొండపైన చాలా దిట్టమైన అడవి కలదు. ఆ అడవిలో, మృగములు గుహలలోనుండి వచ్చే అరుపులు మఱియు పక్షుల గూళ్ళనుండి వినిపించే మధుర సంగీతధ్వనులు కలసిపోయేవి.

ఆ కొండపై రుతుమనువు అనే తోట ఒకటి కలదు. ఆ తోటలో వివిధ రకములైన పుష్ప మఱియు ఫల వృక్షములు కలవు. ఆ తోట వరుణుడికి చెందినది. అ తోటలోని ఒక పెద్ద సరస్సులో తెల్లని, నీలి మఱియు ఎర్రని పద్మములు కలవు. ఈ పద్మముల చుట్టూచేరి తుమ్మెదలు చేయు ఝుమ్మను శబ్దము ఎల్లవేళలా వినిపించుచుండెను. ఆ సరస్సు ఒడ్డున మల్లె, కుంద, జాజి, పున్నాగ, కురవక, మాధవీలతలు విరబూయగా, వాటి సువాసనలమత్తు మైమరపించుచుండెను.

ఆ కొండయందు ఒక ఐరావతము తన పరివారముతో నివసించుచుండెను. ఆ గజేంద్రుడు తన పరివారముతో కలసి ఇష్టం వచ్చినట్లు సంచరించుచుండెను. లేత వెదురు మఱియు చెరుకుగడలు పెరికి తినుట వారికీ ఆటగానుండెను. మదించిన అ ఐరావతము ఉన్నచోటునుండి పులులు, సింహాలు, అడవిపందులు, ఎద్దులు దూరముగా పారిపోయేడివి. ఒకమారు వేసవి కాలంలో ఆ గంజేంద్రుడు తన సహచరులతో మిక్కిలి దూరము నడిచి అలసిపోయెను. బహు దప్పికతో ఉన్న ఆ ఐరావతము దూరముగా ఉన్న సరస్సునుండి వచ్చు సువాసనలను ఆఘ్రాణించి అటు దిక్కుగా చనెను. వెనువెంటనే తన పరివారము కూడా అ సరస్సును చేరి అందు ప్రవేశించెను. ఆ సరస్సునందు ఆ గజపరివారము ఎంతో హాయిని అనుభవించి, అ మధురమైన సరోవర జలమును త్రాగి దప్పిక తీర్చుకోనేను. తదుపరి ఆ హాయిని మరింత అనుభవించుటకై అవి అ సరస్సునందే ఆడి దానిని బురదగా చేసెను. సంసారసుఖములో మునిగిన మానవుడు కాల ప్రవాహమును గుర్తించని విధముగా ఆ గజరాజు కాలము గతించుట గుర్తించలేక పోయెను. ఆ సరస్సు అడుగున దాగి ఉన్న ప్రమాదములను ఆ గజరాజు పూర్తిగా మరచిపోయెను.

విధి ప్రేరణచే, ఆ సరస్సునందు చాల కాలముగా ఒక మకరము నివసించుచుండెను. అది తన వాడి కోరలతో అ గజము కాలును బలముగా పట్టుకొనెను. అకస్మాత్తుగా కలిగిన ఆ బాధకి అ గజరాజు తన శరీరమంతయూ విదిల్చి ఆ మకరము పట్టునుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెను. ఆ గజరాజు బలమైనదైనప్పటికీ అ మొసలి అంతకన్నా బలముగా ఉండుటచే విడిపించుకొనుట సాధ్యము కాకపోయెను. కరిమకరుల మధ్య ఈ భీకరమైన పోరు కొన్ని సంవత్సరములు ఏకధాటిగా సాగెను. అడవిలో చక్రవర్తి వలె సంచరించు అ గజరాజుకు, సరస్సుయను సామ్రాజ్యమునకు రాజుగానున్న ఆ మకరమునకు నడుమ తీవ్రమైన పోరు దేవ, కిన్నెర, కింపురుష, యక్ష, సిద్ధులు మొదలగు వారికి మిక్కిలి ఆశ్చర్యము కలిగించెను. క్రమముగా అ ఏనుగు బలము హరించుకు పోవుచుండెను. మొసలి పట్టు మరింత బలపడుచుండెను. ఏనుగు తన బలము సన్నగిల్లుటచే, ఓటమి తధ్యమని, త్వరలోనే ప్రాణములు పోవునని గ్రహించెను. తనను ఈ విపత్కర పరీస్థితి నుంచి తప్పించుట తనపై ఆధారపడిన తన పరివారులకుగాని లేక ఆ బ్రహ్మాది దేవతలుగానీ సాధ్యము కానిదని గ్రహించిన ఆ ఐరావతము కొంత తడవు యోచన చేసెను. అప్పుడు తనను రక్షించి కాపాడేవాడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే అన్న సత్యము బోధపడింది.

తన మనస్సును ఆలోచనను ఆ శ్రీమన్నారాయణునిపై నిలిపి స్తుతించి గానం చేయనారంభించింది. ఈ సృష్టికి కారకుడు, సనాతన పురుషుడు అయిన ఆ హరిని ఘనంగా పొగిడినది. ఈ లోకాన్ని సృష్టించి తిరిగి తనలోనే లయము చేసికొను అ లక్ష్మీపతిని తనను కాపాడమని కోరింది. ఆ సనాతన పురుషుని దర్సనమునకై ఋషులు వేలాది సంవత్సరాలు ధ్యానం చేస్తారని, లోకకల్యాణం కొరకు అయన రూపం ధరించుట చూచినవారు ఆ స్వామి నిరాకార తత్వమును విస్మరింతురని, ప్రతి దానికి కారకుడు ఆ నారాయణుడేనని  గ్రహించి  స్తుతించింది. తన ఈ గజాకారము వలన కానీ మనస్సు వలన కానీ ఎట్టి ప్రయోజనమూ లేదని, జీవించాలని కోరిక లేదని, ఆ శ్రీహరిని మోక్షము కోరాడు ఆ గజేంద్రుడు.

బ్రహ్మాది దేవతలు ఆ గజేంద్రుడు పలికిన పలుకులు వినిరి. ఆ గజెంద్రము ఆ ఆదిపురుషుని స్తుతించుటచేత, అవి యేవియు తమలో ఏఒక్కరికి వర్తించవని గ్రహించిరి.

ఆ గజేంద్రుని పరీస్తితికి ఆ నారాయణుడు చలించి, శ్రీహరి రూపంలో ప్రత్యక్షము అయ్యెను. ఆతని చేతిలో సుదర్శన చక్రము మెరసెను. నారాయణుని చూచినా అ గజేంద్రుడు తొండముతో ఒక పద్మమును పట్టి పైకెత్తి ఇట్లనెను, "ఓ ప్రభు నీకు నా నమస్కారము ". కరుణామూర్తి అయిన ఆ స్వామి తన సుదర్శన చక్రంతో అ మొసలిని సంహరించి అ గజేంద్రుని వెలుపలకి లాగెను. అమితమైన ప్రేమతో గజేంద్రుడు ఒసగిన పద్మమును శ్రీహరి స్వీకరిచెను. స్వర్గము నుండి దేవతలు ఈ దృశ్యాన్ని బహు ఆశ్చర్యముతో గాంచిరి.  వారందరూ ఇట్లు చూచుచుండగా అ మొసలి శరీరమునుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షము అయ్యెను. ఆతడు అ శ్రీహరిని బహురీతుల పొగిడి అదృశ్యం అయ్యెను.

పూర్వజన్మ

మొసలి :
పూర్వజన్మలో అ మకరము హూహూ అను గంధర్వుడు. ఆతడు తన సతులతో అదే సరస్సులో స్నానమాడుచుండెను. అదే సమయంలో మహర్షి దేవలుడు సరస్సు అడుగున ధ్యానము చేయుచుండెను. ఆ మహర్షి బ్రొటనవేలుని హూహూ లాగెను. కోపోద్రేకుడైన దేవలుడు అ గంధర్వుని మోసలివై ఇదే సరస్సులో ఉండుమని శపించెను. గంధర్వుని సతులు ప్రార్థన చేత కరుణ కలిగి దేవలుడు ఇట్లనెను "ఒక గజెంద్రము ఈ సరస్సులో తన సతులతో ఈ సరస్సులో ప్రవేశించినప్పుడు నీవు దాని కాలును పట్టి విడిచిపెట్టక ఉండవలెను. ఆ గజరాజము భగవంతుని ప్రార్ధించినప్పుడు ఆ శ్రీహరి నిను వధించి నీ మొసలి రూపము నుండి విముక్తి కలిగించును".

గజరాజము : 
గజరాజము పూర్వజన్మలో దక్షిణ పాండ్య దేశమును పాలించు ఇంద్రద్యుమ్నుడు అను మాహారాజు. ఇంద్రద్యుమ్నుడు ధర్మవర్తనుడు. ఎల్లప్పుడూ ఆ భగవంతుని మౌనముగా ధ్యానించి పూజించే వాడు. ఒకనాడు ఈ విధముగా ధ్యానించు నప్పుడు అగస్త్య ముని అటుగా వచ్చెను. ధ్యానములో ఉన్న రాజు ముని రాక గాంచక గౌరవమర్యాదలు చేయలేదు. అప్పుడా ముని ఇట్లనెను "తమస్సు నకు కారణమైన ఏనుగుగా ఈ రాజు జన్మించును". అ శాపమును స్వీకరించిన రాజు ఏనుగుగా జన్మించి త్రికూటపర్వతముపైనున్న అరణ్యములో సంచరించుచుండెను. భగవంతుని స్పర్శ కలిగిన అ గజరాజము మోక్షము పొంది ఆ నారాయణుని సేవకులలో ఒకడైయ్యేను.

శ్రీహరి కటాక్ష సిద్ది రస్తు !